Saturday, April 2, 2011


ఉగాదినాడు పాత బట్టలు ధరించి..

ఫాల్గున మాసం ఆరంభం రోజునుంచి ఐదురోజులపాటు వసంత ఉత్సవాలను జరుపుకోవడం టిబెట్ ప్రజలకు సంప్రదాయం. ఈ ఏడు టిబెట్ ప్రజలు పాతబట్టలు ధరించి కొత్త సంవత్సరాది ఉత్సవాన్ని జరుపుకున్నారు. క్రీస్తుశకం 2008వ సంవత్సరంలో, టిబెట్‌ఉగాది సందర్భంగా చైనా సైనికులు జరిపిన మారణకాండకు నిరసనగా ఇలా మాసిపోయిన దుస్తులను ధరించినట్టు టిబెట్ ప్రజలు చెబుతున్నారు. ఈ ఏడాదికూడ టిబెట్ ప్రజల ఉత్సవ వేదికల చుట్టూ, ఆరామాలవద్దా చైనా సైనికులు విపరీతమైన సంఖ్యలో మోహరించారు. సైనిక పాటవ ప్రదర్శనతో టిబెట్ ప్రజలను భయవిభ్రాంతికి గురిచేయాలన్నది చైనా నియంతల ఎత్తుగడ. 2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడలు జరిగినప్పటినుంచి కూడా చైనా ప్రభుత్వం ఈ ‘్భయవిభ్రాంతి’ని కొనసాగిస్తూనే ఉంది! అయినప్పటికీ టిబెట్ ప్రజల స్వాతంత్య్ర ఉద్యమ జ్వాల చల్లారిపోవడంలేదు! ఈ నూతన వత్సర ఉత్సవాలను మన దేశంలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వం కూడ సాదాసీదాగానే జరుపుకొంది. ‘‘ఘనంగా వేడుకలను జరపడంలేదు కేవలం మత సంప్రదాయాలన పాటిస్తున్నాము’’ అని హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధినేత దలైలామా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18వ తేదీన దలైలామాకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వాషింగ్టన్‌లో ఆతిథ్యం ఇవ్వడం చైనా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించిన ఘటన! దలైలామాను అమెరికా అధ్యక్షుడు కలుసుకోరాదని, కలుసుకున్నట్టయితే అమెరికా చైనా సంబంధాలు ఘోరంగా దెబ్బతింటాయని చైనా ప్రభుత్వం పదేపదే హెచ్చరికలు జారీచేసినప్పటికీ ఒబామా లెక్కచేయకపోవడం అంతర్జాతీయ వ్యవహారాలలో చైనాకు తగిలిన ఎదురుదెబ్బ! 2008 నవంబర్ నుంచి ఆవహించిన ఆర్థికమాంద్యం నుంచి బయటపడడానికి అమెరికా బ్యాంకులలో ఉన్న చైనా పెట్టుబడులు దోహదం చేస్తున్నాయట. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య వినిమయంతో చైనా భారీగా ‘మిగులు’ను సాధిస్తోంది. ఇలా మిగిలిన నిధులను చైనావారు అమెరికాలోనే పెట్టుబడులు పెడతున్నారు. అందువల్ల పెట్టుబడులను ఉపసంహరించి అమెరికాను చైనా ఇబ్బందులపాలు చేయగలదన్న ఆందోళనలు సైతం వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ దలైలామాను కలుసుకొనడానికి అమెరికా అధ్యక్షుడు నిర్ణయించడం అమెరికా ధైర్యానికి నిదర్శనం. 2008 డిసెంబర్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలాయ్ సర్కోజీ మారిన పాశ్చాత్య విధానానికి శ్రీకారం చుట్టాడు, పోలెండ్‌లో దలైలామాతో సమావేశమయ్యాడు. అప్పుడు చైనా అతి తీవ్రంగా ప్రతిస్పందించింది. ఫ్రాన్స్‌తోనేకాక ఐరోపా సమాఖ్యతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామని చైనా నాయకులు హెచ్చరించారు! దలైలామాను టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధినేతగా ప్రపంచలోని ఏ ప్రభుత్వమూ ఇంతవరకూ గుర్తించలేదు! మన దేశంతోసహా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా టిబెట్‌పై చైనా దురాక్రమణను ఆమోదించేశాయి, టిబెట్ చైనాలో భాగమని పదేపదే ప్రకటిస్తున్నాయి! అయినప్పటికీ చైనా మాత్రం నమ్మడంలేదు. ఎందుకంటే టిబెట్ ప్రజల స్వభావం చైనాకు బాగా తెలుసు- వారు స్వాతంత్య్రం తిరిగి సాధించాలని యత్నిస్తున్నారు!
దలైలామా విధానం మారిపోయింది. ఆశ్చర్యకరంగా ప్రపంచ దేశాల విధానంలో కూడ మార్పు వస్తోంది! 1959లో దలైలామాను చైనా ప్రభుత్వం తొలగించింది. అంతవరకు స్వతంత్ర దేశంగా ఉండిన టిబెట్‌ను- ఐదు లక్షల చదరపు మైళ్ల సువిశాల ప్రాకృతిక సంపదల భాండాగారాన్ని- చైనా ఆక్రమించింది. అప్పటినుంచి టిబెట్ స్వాతంత్య్రం కోసం ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్న దలైలామా 2006లో మాట మార్చారు. తమ దేశానికి స్వాతంత్య్రం అక్కరలేదని, ప్రజల సాంస్కృతిక విలక్షణతను, ధార్మిక సంప్రదాయాలను చైనా ప్రభుత్వం కాపాడితే చాలునని దలైలామా అంటున్నారు. కానీ చైనా మాత్రం నమ్మడంలేదు. ఎందుకంటే దలైలామా విధానాన్ని టిబెట్ ప్రజలు అంగీకరించడంలేదని చైనా నియంతలకు బాగా తెలుసు! టిబెట్‌లోని ప్రజలు, ప్రవాస టిబెట్టీయులు సైతం దలైలామా ‘స్వాతంత్య్ర వ్యతిరేక’ వైఖరిని నిరసిస్తున్నారు. దలైలామాతో నిమిత్తం లేకుండా స్వాతంత్య్ర సమరాన్ని సాగిస్తున్నారు. 2008లో ఒలంపిక్ జ్యోతి వివిధ దేశాలలో ఊరేగినపుడు ప్రతిచోట వేల సంఖ్యలో టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమవీరులు నిరసనలు తెలిపారు. ఒలింపిక్ జ్యోతి బీజింగ్ చేరదని, ఒలింపిక్ క్రీడలు సజావుగా జరగవని చైనా ప్రభుత్వమే ప్రచారం చేసింది! టిబెట్ ఉద్యమాన్ని భూతద్దంలో చూపి ప్రపంచ దేశాలనుంచి పదే పదే ‘జ్యోతి’ భద్రతకు హామీలు పొందింది! తమ దేశ సమగ్రతకు హాని కల్పిస్తున్నారన్న సాకుతో దాదాపు 200 మంది టిబెట్టీయులను హత్యచేయించింది. వేలాదిమంది అరెస్టు కావడం, వారిలో కొన్ని వందలమంది జైళ్లలో మగ్గుతుండడం టిబెట్ ప్రజల స్వాతంత్య్ర నిష్ఠకు నిదర్శనం! టిబెట్ ప్రజలు ఉద్యమాన్ని ఆపకపోతే తాము ప్రవాస ప్రభుత్వ పదవినుంచి వైదొలగిపోతామని కూడ దలైలామా పదేపదే హెచ్చరించారు! ఐదు దశాబ్దుల క్రితం తమను హత్యచేయ యత్నించిన చైనా ప్రభుత్వానికి దలైలామా ఇంత గొప్పగా మద్దతు పలుకుతున్నారు. మరి చైనా ప్రభుత్వం దలైలామాను ఎందుకని వ్యతిరేకిస్తోంది??
ఇప్పుడు స్వాతంత్య్ర ఉద్యమం దలైలామా పరిధినుంచి తప్పిపోయింది. చైనా ప్రభుత్వానికి ఇది తెలుసు! టిబెట్‌లోని ప్రజలలో అత్యధికులు చైనా పెత్తనాన్ని, దుర్మార్గాన్ని ప్రతిఘటిస్తున్నారు. ఆయుధాలు లేకపోయినా, అవనీతలంలోని ఏ ప్రభుత్వపు మద్దతు కూడ లభించకపోయినా టిబెట్ ప్రజలు స్వాతంత్య్ర సమర పటిమను కోల్పోవడంలేదు. ఇప్పుడు వారు దలైలామాపై ఆధారపడిలేరు! కేవలం తమ బౌద్ధమత ప్రధాన గురువుగా ఆయనను సమ్మానిస్తున్నారు! అందువల్లనే చైనా కమ్యూనిస్టు దొరతనం బెంబేలెత్తుతోంది! అయితే టిబెట్ ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమం సాగిస్తున్నారని, 1959 పూర్వం నాటి స్థితిని కోరుతున్నారని అంగీకరించడం చైనా ప్రభుత్వానికి అవమానకరం. అంగీకరిస్తే యాబయి ఏళ్ల కమ్యూనిజం టిబెట్‌లో సుఖశాంతులను నెలకొల్పలేకపోయిందన్న సత్యాన్ని నిరూపించినట్టు కాగలదు. టిబెట్‌పై తమది దురాక్రమణ అని ఒప్పుకున్నట్టు కాగలదు. అందువల్ల టిబెట్ స్వదేశీయ ప్రజలపై ఉన్న కోపాన్ని చైనా ప్రభుత్వం వృద్ధ దలైలామా మాధ్యమంగా తీర్చుకొంటోంది! ధార్మిక విషయాలకు పరిమితమైపోయిన ఆ మత గురువును పరుష పదజాలంతో నిందిస్తోంది!
కువాయిట్‌ను , 1990వ దశకంలో, ఆక్రమించిన ఇరాక్‌ను అమెరికా దండించింది! ఇరాక్‌పై దాడిచేసి కువాయిట్‌ను విముక్తం చేసింది! ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించే పద్ధతి అంతర్జాతీయ న్యాయసూత్రాలకు వ్యతిరేకం అయినప్పుడు ఈ నియమం టిబెట్ విషయంలోను వర్తించాలి! కానీ చైనా అతిపెద్ద దేశం కనుక , విపరీతమైన సైనిక పాటవం కలిగిన అణ్వస్త్ర దేశం కనుక ఈ మాటను చెప్పడానికి, టిబెట్‌ను ఖాళీ చేయమని కోరడానికి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. సర్కోజీ ఆరంభించాడు. ఒబామా అందుకున్నాడు! కానీ, ‘టిబెట్ ప్రజల సాంస్కృతికమైన ధార్మికమైన హక్కుల పరిరక్షణ’ గురించి మాత్రమే వారు మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం గురించి ప్రస్తావించడంలేదు. ఇందుకు ప్రధాన కారణం మన ప్రభుత్వ విధానం! టిబెట్ స్వాతంత్య్రం శతాబ్దులపాటుమన దేశాన్ని చైనా దురాక్రమణ నుంచి రక్షించిన సహజకవచం! ఆ కవచానికి మనమే తూట్లు పొడిచాము. ఫలితంగా చరిత్రలో మొదటిసారిగా 1959లో మనకూ చైనాకు మధ్య అతిపెద్ద సరిహద్దు ఏర్పడిపోయింది! భారత టిబెట్ సరిహద్దు భారత చైనా సరిహద్దుగా ఏర్పడింది! నాలుగువేల కిలోమీటర్ల పొడవైన ఉత్తర సరిహద్దును కాపలా కాయడానికి 1947కు పూర్వం సైనికుల అవసరం రాలేదు. ఎందుకంటే భారత సైనిక దళాలు టిబెట్‌లో వుండేవి! చైనా దురాక్రమణనుంచి టిబెట్‌ను కాపాడే బాధ్యత ఆరోజులలో భారత్‌ది. బ్రిటిష్‌వారు నెలకొల్పిన ఈ పద్ధతి 1947 తరువాత మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు గిట్టలేదు. ‘‘టిబెట్‌లో సైనిక దళాలను నెలకొల్పే హక్కు మనకు ఎక్కడిది?’’ అని ఆయన పార్లమెంటులో ప్రశ్నించారు. అందువల్ల మన సైన్యాలను టిబెట్‌నుంచి వెనక్కి రప్పించారు. ఫలితంగా చైనా సైనికులు టిబెట్‌లోకి చొరబడి పోవడమేకాక మన దేశపు సరిహద్దుల వరకూ వచ్చేశారు. టిబెట్‌కు స్వాతంత్య్రం పోవడంవల్ల మనకు నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దును నిరంతరం కాపలా కాచేందుకు వేలాదిమంది సైనికులు అవసరమయ్యారు! 1950వ దశకంలో టిబెట్‌ను చైనా దురాక్రమించినపుడు మన ప్రభుత్వం నిరసన తెలిపి ఉంటే ప్రపంచ దేశాలు స్వరం కలిపి ఉండేవి. కానీ ఐక్యరాజ్యసమితిలోనే మనం చైనాను సమర్ధించి ప్రపంచాన్ని విస్మయంతో ముంచెత్తాము. ఇప్పుడైనా మన ప్రభుత్వం ‘‘టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండాలి’’ అని అంటే చాలు! అనేక విదేశాలు టిబెట్‌కు అండగా నిలుస్తాయి! టిబెట్ స్వతంత్ర దేశమైతే మనం ఉత్తర సరిహద్దులలో కాపలా కాయవలసిన పనిలేదు. చైనాతో మనకు సరిహద్దు తగాదా ఉండదు, సరిహద్దే ఉండదు!!